బాబ్లీ ప్రాజెక్టుపై సుప్రీం కోర్టు తీర్పు

బాబ్లీ ప్రాజెక్టుపై సుప్రీం కోర్టు తీర్పు
గోదావరి నదిపై మహారాష్ట్ర నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టు ఫిబ్రవరి 28న తీర్పునిచ్చింది. బాబ్లీని కూల్చివేసేలా ఆదేశాలివ్వాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. బాబ్లీ ప్రాజెక్టు నుంచి 2.74 టీఎంసీల నీటిని మాత్రమే మహారాష్ట్ర వినియోగించుకోవాలని సూచించింది. వర్షాకాలమంతా ప్రాజెక్టు గేట్లు తెరిచే ఉంచాలని, వర్షాకాలంలో నదీ ప్రవాహానికి అడ్డంకి కల్పించరాదని కోర్టు పేర్కొంది. అంతేకాకుండా నీటి పంపకాన్ని పర్యవేక్షించేందుకు ఒకకమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీలో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రల నుంచి ఒక్కొక్కరు, కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) నుంచి మరొకరు సభ్యులుగా ఉంటారని తెలిపింది. కమిటీ చైర్మన్‌గా సీడబ్ల్యూసీ సభ్యుడు వ్యవహరిస్తారని చెప్పింది. ప్రాజెక్టు నిర్వహణపై కమిటీకి దిశానిర్దేశం చేసింది. 1975లో ఇరు రాష్ట్రాల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు 60 టీఎంసీల పరిమితికి లోబడే మహారాష్ట్ర నీటిని వాడుకుంటోందని అభిప్రాయపడింది. పోచంపాడు రిజర్వాయర్ పరిధిలో 0.6 టీఎంసీల నీటిని వాడుకుంటున్నందున, అంతే పరిమాణంలో నీటిని మహారాష్ట్ర మార్చి 1న ఏపీకి విడుదల చేయాలని ఆదేశాలిచ్చింది. శ్రీరాంసాగర్ ముంపు ప్రాంతంలో మహారాష్ట్ర బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణాన్ని 2005లో చేపట్టింది. దీన్ని వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2006లో పిటిషన్ దాఖలు చేసింది.

--

0 comments:

Post a Comment

పాఠకులందరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.ఇట్లు - భారతీయులం