మన దేశంలో త్రివర్ణపతాకమంటే జాతీయపతాకమే


భారత జాతీయపతాకం ప్రస్తుతమున్న రూపంలో 1947 జూలై 22వ తేదీన జరిగిన రాజ్యాంగసభ ప్రత్యేక సమావేశంలో ఆమోదించబడింది. మన దేశంలో త్రివర్ణపతాకమంటే జాతీయపతాకమే. దీంట్లో పైనుంచి కిందకు అడ్డపట్టీలవలె వరుసగా కాషాయం, తెలుపు మరియు ఆకుపచ్చ రంగులు సమ నిష్పత్తిలో ఉంటాయి. మధ్యభాగంలో 24 ఆకులతో ఆకాశనీలం రంగులో అశోకచక్రం ఉంటుంది. ఈ చక్రం నమూనాను సారనాథ్‌లోని అశోకస్థంభం నుంచి తీసుకున్నారు. దీని వ్యాసం తెలుపు రంగు పట్టీ యొక్క ఎత్తులో నాలుగింట మూడొంతులు. జెండా ఎత్తు, వెడల్పుల నిష్పత్తి 2:3. ఇది భారత సైన్యం యొక్క యుద్ధపతాకం కూడా.


భారత జాతీయ పతాకాన్ని రూపొందించింది ఆంధ్రుడైన పింగళి వెంకయ్య. జాతీయపతాకాన్ని ఖాదీ బట్టతో మాత్రమే చేయాలని జాతీయపతాక నిబంధనలు తెలియజేస్తున్నాయి. పతాకావిష్కరణ, వాడకాల గురించి ఖచ్చితమైన నియమావళి అమల్లో ఉంది.

స్వాతంత్ర్యం పొందడానికి ముందు భారతదేశంలో అతిపెద్ద రాజకీయ వేదికగా ఉన్న భారత జాతీయ కాంగ్రెసు 1921లో తెలుపు, ఆకుపచ్చ, ఎరుపు రంగులతో అనధికారికంగా ఒక పతాకాన్ని రూపొందించుకొంది. ఎరుపు హిందూమతానికి, ఆకుపచ్చ ఇస్లాం మతానికి, తెలుపు ఇతర మతాలకు సూచికలు. కాంగ్రెసు 1931లో కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులతో, మధ్యలో రాట్నము బొమ్మగల పతాకాన్ని తన అధికారిక పతాకంగా స్వీకరించింది. ఈ పతాకంలో ఎటువంటి మతపరమైన ప్రతీకలూ లేవు.

1947 ఆగస్టులో భారతదేశానికి స్వాతంత్ర్యం రావడానికి కొన్నిరోజుల ముందు ఏర్పాటైన రాజ్యాంగసభ, కాంగ్రెస్ పార్టీ పతాకాన్నే అన్ని పార్టీలకు, అన్ని మతాలవారికి ఆమోదయోగ్యమైన మార్పులు చేసి జాతీయపతాకంగా స్వీకరించడానికి నిర్ణయించింది. అన్నిటికంటే ముఖ్యమైన మార్పు రాట్నము స్థానంలో అశోకచక్రాన్ని చేర్చడం.

అంతకు ముందున్న జెండాలోని రంగులకు మతపరమైన అన్వయాలున్నందున స్వతంత్ర భారత తొలి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్, జాతీయపతాకానికి ఎటువంటి మతపరమైన అన్వయాలూ లేవని స్పష్టం చేస్తూ పతాకప్రాధాన్యతను ఇలా వివరించాడు: "కాషాయరంగు త్యాగానికి గుర్తు. ఇది మన నాయకులు స్వలాభాన్ని విడిచిపెట్టి తమ కర్తవ్యానికి అంకితం కావాలని సూచిస్తుంది. తెలుపురంగు మన ప్రవర్తనను నిర్దేశించే వెలుగుకు, సత్యానికి గుర్తు. ఆకుపచ్చరంగు మట్టితో మనకున్న అనుబంధానికి, ఇతరజీవులన్నీ ఏ వృక్షసంపదమీద ఆధారపడి ఉన్నాయో ఆ పచ్చని చెట్లకు గుర్తు. అశోకచక్రం ధర్మపాలనకు గుర్తు. సత్యం, ధర్మం అనేవి ఈ పతాకం క్రింద పనిచేసే ప్రతి ఒక్కరి నియమాలు కావాలి. పైగా చక్రం చలనానికి, చైతన్యానికి గుర్తు. జీవమున్న ప్రతిచోటా చైతన్యముంటుంది. చైతన్యం లేనిది చావులోనే. భారతదేశం ఇక మీదట మార్పును స్వాగతిస్తూ ముందుకు సాగిపోవాలి. చక్రం శాంతియుతమైన, చైతన్యవంతమైన ప్రగతికి చిహ్నం."

ఐతే కాషాయం స్వచ్ఛతకు, ఆధ్యాత్మికతకు; తెలుపు శాంతికి, సత్యానికి; ఆకుపచ్చ సాఫల్యతకు, సస్యసమృద్ధికి చిహ్నాలనే ఒక అనధికారిక అన్వయం కూడా బాగా ప్రచారంలో ఉంది.

పతాక కొలతలు కొలత మి.మీ.
1 6300 × 4200
2 3600 × 2400
3 2700 × 1800
4 1800 × 1200
5 1350 × 900
6 900 × 600
7 450 × 300
8 225 × 150
9 150 × 100
@ భారతీయులం 
|www.facebook.com/bharatiyulam | bharatiyulam.blogspot.com

భారతీయులం” |.:: bharatiyulam.blogspot.in ::. | "Facebook"

0 comments:

Post a Comment

పాఠకులందరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.ఇట్లు - భారతీయులం